లోక్ సభలో టీడీపీ విప్ పదవిని విజయవాడ లోక్ సభ సభ్యుడు కేశినేని నాని తిరస్కరించిన సంగతి తెలిసిందే. విప్ పదవిలో నియమించడం పట్ల అలకబూనిన విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేనిని హైకమాండ్ బుజ్జగించేందుకు రంగంలోకి దిగింది. ఈ నేపథ్యంలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత గల్లా జయదేవ్ ఈరోజు విజయవాడకు చేరుకొని కేశినేని నానితో భేటీ అయ్యారు. పార్టీపై అలక వహించడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ విషయమై కేశినేని నాని స్పందిస్తూ.. టీడీపీ విప్ తిరస్కరణ అంశాన్ని పెద్దదిగా చేసి చూపించవద్దని మీడియాను కోరారు. తాను విజయవాడ లోక్ సభ సభ్యుడిగానే లోక్ సభలో అవిశ్వాస తీర్మానం పెట్టానని గుర్తుచేశారు. పోరాడేందుకు పదవులు అవసరం లేదని స్పష్టం చేశారు. ఫేస్ బుక్ లో తన వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పుకునే స్వేచ్ఛ ఉందని వ్యాఖ్యానించారు. విభజన హామీలపై విజయవాడ ఎంపీగానే పోరాడానని స్పష్టం చేశారు.


చట్టాల సవరణపై కేసీఆర్ ఏకపక్ష నిర్ణయం సరికాదు: డీకే అరుణ