బీటెక్ విద్యార్థి ఫస్ట్ సెమిస్టర్లో పలు సబ్జెక్టుల్లో ఫెయిలైన భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకుముందు ‘బై గాయ్స్’, ‘థ్యాంక్యూ ఫర్ గివింగ్ మి దిస్ వండర్ఫుల్ లైఫ్’ .. అంటూ స్నేహితులకు మెసేజ్ చేశాడు. ఖమ్మంలో జరిగిందీ ఘటన. జిల్లాలోని కల్లూరు మండలం లింగాలకు చెందిన పవన్ హైదరాబాద్లోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఇటీవల జరిగిన ఫస్ట్ సెమిస్టర్ పరీక్షల్లో పలు సబ్జెక్టుల్లో ఫెయిలైన పవన్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. మూడు రోజుల క్రితం ఖమ్మంలోని ముస్తాఫానగర్లో ఉంటూ డిగ్రీ చదువుతున్న స్నేహితుల దగ్గరకు వచ్చాడు.
కుమారుడు ఖమ్మం వచ్చిన విషయం పవన్ తల్లిదండ్రులకు తెలియదు. గురువారం రాత్రి స్నేహితులు ఉంటున్న భవనంపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన స్నేహితులు స్థానికులతో కలిసి పవన్ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి కిమ్స్కు తరలించారు. అతడిని బతికించేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆత్మహత్య చేసుకోవాలని ముందే నిర్ణయించుకున్న పవన్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ‘బై గాయ్స్’, ‘థ్యాంక్యూ ఫర్ గివింగ్ మి దిస్ వండర్ఫుల్ లైఫ్’ ..అని పోస్టు చేశాడు. పవన్ జేబులో ఉన్న సూసైడ్ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.