లక్ష్మీస్ ఎన్టీఆర్’ దర్శకుడు రాంగోపాల్ వర్మ ప్రెస్మీట్ పై ఏపీ పోలీసులు స్పందించారు. ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్న కారణంగా విజయవాడలో సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ మరియు సెక్షన్ 144 అమలులో ఉన్నాయని, అందుకే బహిరంగ ప్రదేశాలో ఎలాంటి సమావేశాలు, సభలకు అనుమతి లేదని విజయవాడ పోలీసులు స్పష్టం చేశారు. ఒకవేళ సభలు, సమావేశాలు నిర్వహించుకోవాలంటే ముందస్తు అనుమతులు తప్పనిసరి అని తేల్చి చెప్పారు.
ఆయన ప్రెస్మీట్ వల్ల రెండు వర్గాల మధ్య ఘర్షణ సైతం తలెత్తే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా రాం గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాపై తలపెట్టిన ప్రెస్మీట్ కార్యక్రమానికి ఎంచుకున్న ప్రదేశం పైపుల రోడ్ నిత్యం హైదరాబాద్కు వెళ్లే వాహనాలతో రద్దీగా ఉంటుందని, అత్యవసర సర్వీసులకు ఆటంకం ఏర్పడే ప్రమాదముందని పోలీసులు తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగి ఆస్తి, ప్రాణ నష్టం జరిగే అవకాశముందని అందుకే రాం గోపాల్ వర్మ ప్రెస్ మీట్కు అనుమతిని నిరాకరించినట్లు పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు.