తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఏపీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. శుక్రవారం కృష్ణా జిల్లా గుడివాడలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ కేసుల కోసం కేసీఆర్ తో రాజీపడిన జగన్ ఏపీకి అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. ఏపీపై తెలంగాణ పెత్తనం ఏంటని చంద్రబాబు ప్రశ్నించారు. కేసీఆర్ గతంలో ఆంధ్రావాళ్లను దున్నపోతులు, కుక్కలు అని విమర్శించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్ట్ ల పై కేసులు వేస్తూ కేసీఆర్ ఏపీకి అన్యాయం చేస్తున్నారని దుయ్యబట్టారు.
సొంత బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురైతే గుండెపోటు అని డ్రామాలు ఆడారని ధ్వజమెత్తారు.ప్రత్యేకహోదా అమలుచేయాలని కోరినందుకు ప్రధాన మోదీ ఐటీ సంస్థలతో దాడులు చేయిస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీకి ఇవే చివరి ఎన్నికలు అవుతాయని జోస్యం చెప్పారు. వైసీపీ అధికారంలోకి వస్తే అమరావతి అభివృద్ధి ఆగిపోతుందని చంద్రబాబు పేర్కొన్నారు. జగన్ అధికారంలోకి వస్తే అమరావతిలో ఎవరు పెట్టుబడులు పెట్టరన్నారు.