పశ్చిమాసియాలో నెలకొన్న భద్రతా పరిస్థితుల నేపథ్యంలో ఖతార్లో చిక్కుకుపోయిన సుమారు 1000 మంది భారతీయ ప్రయాణికులు సురక్షితంగా స్వదేశానికి తిరిగి వచ్చారు.
వీరిని న్యూఢిల్లీ, ముంబై, కొచ్చి నగరాలకు తరలించినట్లు దోహాలోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది.
ప్రయాణికుల తరలింపు ప్రక్రియను సులభతరం చేసేందుకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నట్లు స్పష్టం చేసింది.
ఎంబసీ తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పంచుకున్న వివరాల ప్రకారం నిన్న ఖతార్ ఎయిర్వేస్కు చెందిన విమానాల్లో ఈ ప్రయాణికులు భారత్కు చేరుకున్నారు.
చిక్కుకుపోయిన భారతీయుల ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు, ముఖ్యంగా మానవతా దృక్పథంతో అత్యవసర కేసులకు ప్రాధాన్యత ఇచ్చేందుకు ఖతార్ ఎయిర్వేస్తో సమన్వయం చేసుకున్నట్లు పేర్కొంది.
వారి సహకారానికి ఎంబసీ కృతజ్ఞతలు తెలిపింది. ఇవాళ న్యూఢిల్లీకి మరో విమానం షెడ్యూల్ అయినట్లు కూడా వెల్లడించింది.
విమాన ప్రయాణంతో పాటు రోడ్డు మార్గంలో ప్రయాణించే వారికి కూడా ఎంబసీ సహాయపడుతోంది. సౌదీ అరేబియాలోని సల్వా సరిహద్దు గుండా ప్రయాణించడానికి వీలుగా భారతీయులకు 96 గంటల వ్యాలిడిటీతో తాత్కాలిక ట్రాన్సిట్ వీసాలను జారీ చేస్తున్నట్లు వివరించింది.
ఖతార్లో చిక్కుకుపోయిన భారత బాస్కెట్బాల్ జట్టు కూడా సౌదీ అరేబియా నుంచి విమానాల్లో స్వదేశానికి చేరుకుంది.
ఈ విషయంలో సహకరించిన సౌదీ అరేబియా, ఖతార్ అధికారులకు ఎంబసీ ధన్యవాదాలు తెలియజేసింది.
సహాయం కోసం ఎంబసీలో 24/7 కంట్రోల్ రూమ్ పనిచేస్తోందని, దీంతో పాటు భారతీయ కమ్యూనిటీ సంస్థలైన ఐసీసీ, ఐసీబీఎఫ్కు చెందిన హెల్ప్లైన్లు కూడా అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేసింది.

