ప్రజలు సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా చర్యలు తీసుకుంటున్నట్టు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. సైబర్ సెక్యూరిటీ అంశంపై శనివారం ఖైరతాబాద్లో నిర్వహించిన జాతీయ సదస్సుకు కిషన్ రెడ్డి, హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ సహా పలువురు సైబర్ నిపుణులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో నేరాల నియంత్రణకు స్మార్ట్కార్డులు ప్రవేశ పెట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. సైబర్ టెక్నాలజీలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించేందుకు మరింత అధ్యయనం అవసరమన్నారు. సైబర్ నేరగాళ్ల అప్పగింతకు ఇతర దేశాలతో ఒప్పందం చేసుకుంటున్నట్టు తెలిపారు. అన్ని రాష్ట్రాలతోనూ ఈ విషయంలో సమన్వయం చేసుకుంటున్నట్టు చెప్పారు.