చట్టసభల పనితీరు, ప్రజాస్వామ్య విలువలపై విద్యార్థుల్లో అవగాహన పెంపొందించే దిశగా కొనసాగుతున్న ఏపీ అసెంబ్లీ విజ్ఞాన యాత్రలో భాగంగా మంగళవారం 495 మంది విద్యార్థులు శాసనసభను సందర్శించారు.
గత పది రోజులుగా ఉత్సాహంగా సాగుతున్న ఈ కార్యక్రమంలో ఇప్పటివరకు 107 పాఠశాలలకు చెందిన 3,718 మంది విద్యార్థులు అసెంబ్లీ సమావేశాలను ప్రత్యక్షంగా వీక్షించారు.
చిన్న వయసులోనే సభా కార్యక్రమాలను చూసే అవకాశం దక్కడం పట్ల విద్యార్థులు అమితానందం వ్యక్తం చేశారు.
ఈ పర్యటనలో భాగంగా నర్సీపట్నం రిషి వ్యాలీ స్కూల్కు చెందిన 120 మంది విద్యార్థులు శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడిని ప్రత్యేకంగా కలిశారు. సభా విరామ సమయంలో వారితో ఆత్మీయంగా ముచ్చటించిన స్పీకర్.
విద్యార్థులు అడిగిన పలు ఆసక్తికరమైన సందేహాలను ఓపికగా నివృత్తి చేశారు. అసెంబ్లీని సందర్శించిన ఈ విద్యార్థులందరికీ త్వరలోనే రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టును సైతం చూసే అవకాశం కల్పిస్తామని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు.
యువత కేవలం చదువు, ఉద్యోగాలు, కుటుంబం వరకే పరిమితం కాకుండా సమాజానికి మెరుగైన సేవలు అందించేందుకు రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు పిలుపునిచ్చారు.
ఇదే క్రమంలో మాతృభాష ప్రాముఖ్యతను ఆయన నొక్కిచెప్పారు.
ఇళ్లలో ఆంగ్లం కాకుండా తెలుగులోనే మాట్లాడాలని, ‘మమ్మీ, డాడీ’ అనడానికి బదులుగా మన సంస్కృతి ఉట్టిపడేలా ‘అమ్మ, నాన్న’ అని ఆప్యాయంగా పిలవాలని విద్యార్థులకు సూచించారు.
మన తెలుగు భాషను, మూలాలను ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోకూడదని ఆయన హితబోధ చేశారు.

