telugu navyamedia
CBN ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

లడ్డూలో కల్తీ జరిగిందని వైవీ సుబ్బారెడ్డే ఒప్పుకున్నాక కూడా, వైసీపీ నేతలు ఎదురుదాడి చేయడం దుర్మార్గము: మంత్రి అచ్చెన్నాయుడు

తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో వైసీపీ నేతలపై ఏపీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

శాసనమండలిలో ఆయన మాట్లాడుతూ.. లడ్డూలో కల్తీ జరిగిందని నాటి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డే స్వయంగా ఒప్పుకున్నాక కూడా, వైసీపీ నేతలు సిగ్గులేకుండా ఎదురుదాడి చేయడం దుర్మార్గమని మండిపడ్డారు.

“తప్పు ఒప్పుకున్నాక కూడా బుకాయిస్తారా? వైసీపీ నేతల్లారా సిగ్గుపడండి” అని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు.

కోట్ల మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసి, పవిత్ర ప్రసాదాన్ని అపవిత్రం చేసిన వైసీపీకి ధర్మం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని విమర్శించారు.

ఈ సందర్భంగా గతంలో జగన్ తిరుమల పర్యటనను మంత్రి గుర్తుచేశారు. హిందూ సంప్రదాయాల ప్రకారం డిక్లరేషన్ ఇవ్వడానికి జగన్ ఎందుకు భయపడ్డారని ప్రశ్నించారు.

అంతేకాకుండా, హెరిటేజ్ సంస్థపై అడ్డగోలు ఆరోపణలు చేయడం మానుకోవాలని, దమ్ముంటే కనీసం ఒక్క ఆధారమైనా చూపాలని వైసీపీకి సవాల్ విసిరారు.

వ్యవస్థలను భ్రష్టు పట్టించి, హిందూ ధర్మంపై దాడులకు పాల్పడిన ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని అచ్చెన్నాయుడు హెచ్చరించారు.

సత్యం గెలిచి తీరుతుందని, తప్పు చేసిన వారు తప్పకుండా శిక్ష అనుభవిస్తారని ఆయన స్పష్టం చేశారు.

Related posts