పాకిస్థాన్లో నెలకొన్న భద్రతా పరిస్థితుల దృష్ట్యా, ఆ దేశానికి ప్రయాణాలు పెట్టుకోవద్దని అమెరికా తమ పౌరులకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.
ఉగ్రవాదం, నేరాలు, అంతర్యుద్ధం, కిడ్నాపుల వంటి ప్రమాదాలు పొంచి ఉన్నందున పాకిస్థాన్ ప్రయాణ ప్రణాళికలను పునఃసమీక్షించుకోవాలని అమెరికా విదేశాంగ శాఖ సూచించింది.
ఈ మేరకు గురువారం కొత్త ట్రావెల్ అడ్వైజరీని విడుదల చేసింది. పాకిస్థాన్కు ‘లెవెల్ 3’ కేటగిరీ హెచ్చరిక జారీ చేసినట్లు వెల్లడించింది.
లెవెల్ 3 అంటే అధిక ప్రమాదం ఉన్న ప్రాంతమని, ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని అర్థం.
ప్రధాన రవాణా కేంద్రాలు, మార్కెట్లు, హోటళ్లు, షాపింగ్ మాల్స్, సైనిక స్థావరాలు, విమానాశ్రయాలు, రైళ్లు, పాఠశాలలు, ఆసుపత్రులు, ప్రార్థనా స్థలాలు.
పర్యాటక ప్రాంతాలు, ప్రభుత్వ భవనాలే లక్ష్యంగా దాడులు జరగవచ్చని అమెరికా విదేశాంగ శాఖ తన అడ్వైజరీలో వివరించింది.
ముఖ్యంగా బలూచిస్థాన్ ప్రావిన్స్, ఖైబర్ పఖ్తుంఖ్వా (కేపీ) ప్రావిన్స్, గతంలో కేంద్ర పాలిత గిరిజన ప్రాంతాలుగా (FATA) ఉన్న ప్రదేశాలకు ‘లెవెల్ 4’ హెచ్చరిక జారీ చేసింది. ఈ ప్రాంతాలకు ఎలాంటి పరిస్థితుల్లోనూ వెళ్లవద్దని స్పష్టం చేసింది.

