పిల్లల నిర్జలీకరణ చికిత్స గురించి తల్లిదండ్రులను తప్పుదారి పట్టించే చక్కెర కలిగిన పానీయాలలో ORS లేబుల్ దుర్వినియోగానికి వ్యతిరేకంగా ఎనిమిది సంవత్సరాల పాటు జరిగిన పోరాటానికి మార్గదర్శకంగా నిలిచిన డాక్టర్ శివరంజని సంతోష్ కు పలువురు అభినందనలు తెలిపారు.
పిల్లలకు కాస్త అనారోగ్యం వస్తే ఓఆర్ఎస్ తాపించాలని డాక్టర్లు చెబుతారు. ఈ ఓఆర్ఎస్ పేరుతో మార్కెట్లో చాలా డ్రింకులు ఉన్నాయి.
కానీ అవన్నీ ఓఆర్ఎస్ కాదు అని పంచదార కలిపినవని డాక్టర్ చాలాకాలంగా పోరాటం చేస్తున్నారు.
హైదరాబాద్కు చెందిన పీడియాట్రిషియన్ డా. శివరంజని సంతోష్ 8 సంవత్సరాలుగా మోసపూరిత ‘ORS’ (ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్) పానీయాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు.
ఈ నెల 14న ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) చక్కెర కలిగిన పానీయాలకు ‘ORS’ లేబుల్ ఉపయోగించడాన్ని నిషేధించింది.
ఫార్మసీలలో రంగురంగుల ప్యాకేజీల్లో ఉండే ORS డ్రింక్స్ ను సెలబ్రిటీలు ప్రమోట్ చేస్తూంటారు. వీటిలో మెడికల్ ORS కంటే 10 రెట్లు ఎక్కువ చక్కెర లీటరుకు 120 గ్రాములు, తక్కువ ఎలక్ట్రోలైట్లు ఉన్నాయి.
ఇవి పిల్లల డయేరియాను మరింత తీవ్రం చేస్తాయి. WHO సిఫారసు ORS ఫార్ములా లీటరు నీటికి 2.6 గ్రాముల సోడియం క్లోరైడ్, 1.5 గ్రాముల పొటాషియం క్లోరైడ్, 2.9 గ్రాముల సోడియం సైట్రేట్, 13.5 గ్రాముల డెక్స్ట్రోజ్ మాత్రమే కలిగి ఉండాలి.
కానీ ఈ మోసపూరిత పానీయాలు 100 మి.లీ.కు 8-12 గ్రాముల చక్కెర (3-5 టీస్పూన్లు) కలిగి ఉన్నాయి.
డా. శివరంజని 2017 నుంచి ఈ సమస్యను గుర్తించి, సోషల్ మీడియాలోఅవగాహన కల్పిస్తున్నారు. “మీ పిల్లలు అనారోగ్యంగా ఉన్నప్పుడు ఫార్మసీలో ORS అడిగితే, జీవితాలు కాపాడే సొల్యూషన్ బదులు చక్కెర పానీయం ఇస్తే ఎలా?” అని ఆమె ప్రశ్నించారు.
2022 ఏప్రిల్ 8న FSSAI మొదటి నిషేధం జారీ చేసింది, కానీ డిస్క్లైమర్లు చిన్న అక్షరాలలో ఉండి, గ్రామీణ ప్రాంతాలలో పేరెంట్లు చదవలేకపోతున్నారు.
2024లో కొత్త బ్రాండ్లు మార్కెట్లోకి వచ్చాయి. సెప్టెంబర్లో డా. శివరంజని తెలంగాణ హైకోర్టులో PIL దాఖలు చేశారు.
ఎండోక్రైన్ సొసైటీ ఆఫ్ ఇండియా, వుమెన్ పీడియాట్రిషియన్స్ ఫోరమ్, వేలాది పేరెంట్లు, డాక్టర్లు, జర్నలిస్టులు సహకరించారు.
2025 అక్టోబర్ 14న FSSAI మళ్లీ నిషేధం జారీ చేసింది: “ఏ పానీయం లేదా ఆహార ప్రొడక్ట్లో ‘ORS’ ఉపయోగించకూడదు, విక్రయం ఆపాలి.” ఇది ఫుడ్ సేఫ్టీ యాక్ట్ 2006ను ఉల్లంఘిస్తుందని స్పష్టం చేసింది.