న్యూఢిల్లీ వేదికగా ఇండియా-రష్యా వర్కింగ్ గ్రూప్ 11వ సమావేశం జరిగింది.
ఈ సమావేశానికి భారత్ తరఫున పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) కార్యదర్శి అమర్దీప్ సింగ్ భాటియా, రష్యా పక్షాన ఆ దేశ పరిశ్రమలు, వాణిజ్య శాఖ ఉప మంత్రి అలెక్సీ గ్రుజ్దేవ్ అధ్యక్షత వహించారు.
ఈ భేటీలో ఇరు దేశాలకు చెందిన సుమారు 80 మంది ఉన్నతాధికారులు, పరిశ్రమల ప్రతినిధులు, నిపుణులు పాల్గొన్నారు.
గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల పురోగతిని ఈ భేటీలో సమీక్షించారు. ముఖ్యంగా అల్యూమినియం, ఎరువుల ఉత్పత్తి, రైల్వే రవాణా వ్యవస్థల అభివృద్ధిలో పరస్పర సహకారంపై విస్తృతంగా చర్చించారు.
అల్యూమినియం, ఎరువులు, రైల్వేలు, గనుల టెక్నాలజీ వంటి కీలక రంగాల్లో కలిసి పనిచేయాలని నిర్ణయించాయి.
గనుల రంగంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేసుకోవడం, నిపుణులకు శిక్షణ ఇవ్వడం, పారిశ్రామిక, గృహ వ్యర్థాల నిర్వహణ వంటి అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.
సంప్రదాయ రంగాలతో పాటు భవిష్యత్ టెక్నాలజీల్లోనూ కలిసి పనిచేయాలని ఇరు దేశాలు నిర్ణయించాయి.
ఏరోస్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ, చిన్న విమానాల కోసం పిస్టన్ ఇంజిన్ల తయారీ, కార్బన్ ఫైబర్ టెక్నాలజీ, 3డీ ప్రింటింగ్ వంటి ఆధునిక రంగాల్లో అవకాశాలను అన్వేషించాలని తీర్మానించాయి.
వీటితో పాటు అరుదైన ఖనిజాల వెలికితీత, భూగర్భ బొగ్గు గ్యాసిఫికేషన్ వంటి అంశాలపై కూడా చర్చలు జరిపారు.
చర్చల అనంతరం ఇరు దేశాల ప్రతినిధులు సహకార ప్రోటోకాల్పై సంతకాలు చేశారు.
ఈ ఒప్పందం భారత్-రష్యా మధ్య పారిశ్రామిక, ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.
కేసీఆర్ తీరుతో రాష్ట్రం అభాసుపాలు: ఉత్తమ్