జేడీఎస్ అధినేత హెచ్డీ దేవే గౌడ లోక్సభ ఎన్నికల్లో కనీసం పది ఎంపీ స్థానాలైనా తమకు కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని డిమాండ్ చేశారు. దేవే గౌడను ఢిల్లీలోని ఆయన నివాసంలో ఈ ఉదయం రాహుల్గాంధీ కలిసి కర్ణాటకలో లోక్సభ సీట్ల పంపకాలపై చర్చించిన విషయం తెలిసిందే. రెండు గంటలపాటు ఇరువురి మధ్య చర్చలు జరిగాయి. కర్ణాటకలో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, జేడీఎస్ జాతీయ జనరల్ సెక్రటరీ దినేష్ అలీ ఈ భేటీలో పాల్గొన్నారు.
ఇరుపార్టీల మధ్య సీట్ల పంపకాలపై చర్చలు జరగడం ఇదే తొలిసారి. కర్ణాటకలో మొత్తం 28 లోక్ సభ సీట్లు కలవు. ఇందులో 12 సీట్లను కేటాయించాల్సిందిగా మొదట అడిగినట్లు దేవే గౌడ తెలిపారు. కాగా కనీసం పది స్థానాలనైనా ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేసినట్లు పేర్కొన్నారు. దీనిపై రాహుల్ గాంధీ తుది నిర్ణయం తీసుకుంటారన్నారు. ఈ నెల 10వ తేదీన సీట్ల పంపకాలపై తుది ప్రకటన వెలువడనున్నట్లు దినేష్ అలీ తెలిపారు.