తెలంగాణకు బుల్డోజర్లు వస్తున్నాయని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముగ్గురు ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసినందుకు నిరసనగా హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద భాజపా నేతలు ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్షకు దిగారు.
ఈ దీక్షలో పాల్గొన్న రాజాసింగ్ మాట్లాడుతూ..బండి సంజయ్ ఢిల్లీ వెళ్లారని, తెలంగాణకు బుల్డోజర్లు రాబోతున్నాయంటూ ఆయన చెప్పారు. యూపీలో ఆదిత్యనాథ్ బుల్డోజర్ తో అవినీతిపరులను తొక్కించారన్న రాజాసింగ్ … ప్రతి నియోజకవర్గంలో బుల్డోజర్లను ఆర్డర్ చేశామని, అవినీతి మంత్రులు, ఎమ్మెల్యేలపైకి అవి దూసుకు వెళతాయని రాజాసింగ్ సంచలన కామెంట్స్ చేశారు.
ఈటెలను ఆడుకోవాలన్న ఆలోచనలో కేసీఆర్ ఉన్నారని రాజాసింగ్ అన్నారు. ఈటల రాజేందర్, బండి సంజయ్ వ్యక్తులు కాదని శక్తులని రాజాసింగ్ అన్నారు. వారిద్దరితో పెట్టుకుంటే కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావు మసైపోతారని వ్యాఖ్యానించారు. బీజేపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారన్నారు. కేసులకు భాజపా శ్రేణులు ఏమాత్రం భయపడేది లేదన్నారు.