telugu navyamedia
క్రైమ్ వార్తలు

కదిరి టీచ‌ర్ దారుణ హత్య : ఛేదించిన పోలీసులు

అనంతపురం జిల్లా కదిరిలో సంచలనం సృష్టించిన ఉపాధ్యాయురాలి హత్య కేసు ఎట్ట‌కేల‌కు మిస్టరీని వీడింది. దండుపాళ్యం సినిమా స్ఫూర్తితో ఓ తీవ్రమైన నేరానికి పాల్పడిన నిందితున్ని పోలీసులు పట్టుకున్నారు.

గత ఏడాది నవంబర్ లో అనంతపురం జిల్లా కదిరిలో టీచర్ ఉషారాణి హత్య జరిగింది. సుమారు ఐదు వేల మందిని విచారించిన పోలీసులు.. కదిరికి చెందిన షఫీవుల్లాను నిందితుడిగా తేల్చారు. దండుపాళ్యం సినిమా చూసి షఫీ ఇంతటి ఘెరానికి పాల్పడినట్లు అనంతపురం ఎస్పీ ఫక్కీరప్ప పేర్కొన్నారు. కేసు వివరాలను వెల్లడించిన ఎస్పీ ఫక్కీరప్ప దండుపాళ్యం చిత్రయూనిట్ పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.

నిందితుడి కోసం 8 ప్రత్యేక బృందాలుతో ఐదు రాష్ట్రాల్లో గాలింపు

ఉపాధ్యాయురాలి హత్య కేసును పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. నిందితుడు షఫీవుల్లా పట్టుకోవడం కోసం ఒక అదనపు ఎస్పీ, ఇద్దరు డీఎస్పీలు, ముగ్గురు సీఐ లు, ఐదుగురు ఎస్సై లతో కూడిన 8 ప్రత్యేక పోలీసు బృందాలు, 90 రోజుల పాటు పగలు రేయి అనే తేడా లేకుండా శ్రమించారు. నిందితుడి కోసం 5 రాష్ట్రాలలో గాలించి, 5 వేల మంది అనుమానితులను విచారించారు. లక్షలాది ఫోన్ కాల్స్‌ను విశ్లేషించారు. చివరకు హత్య చేసింది ఒక్కడే అని తేల్చిన పోలీసులు.. ఎట్టకేలకు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

నిందితుడు షఫీవుల్లా నుంచి పోలీసులు 58 తులాల బంగారం, 97 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.  బైకుల నుండి పెట్రోల్ దొంగలించడం మొదలుపెట్టి దండుపాళ్యం గ్యాంగ్ తరహాలో మర్డర్ చేశాడు నిందితుడు.

ఇలాంటి సినిమాలు తీస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పోలీసులు. ఈ నిందితుడు ఇప్పటికే కర్ణాటక రాష్ట్రంలో ఏడు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు.

Related posts