హైదరాబాద్ ః తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ లోగా వంద శాతం కోవిడ్ వాక్సినేషన్ జరిగేలా చూడాలని ఆరోగ్య శాఖ, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అధికారులను ఆదేశించారు. ఇంటింటి సర్వే నిర్వహించి మొదటి డోస్, రెండో డోస్ ఎంత మంది తీసుకున్నారనే వివరాలు పక్కా సేకరించాలని చెప్పారు.
గురువారం సిద్దిపేట నుండి టెలీ కాన్ఫరెన్స్లో మంత్రి హరీష్ రావు వైద్యరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.ఆశాలు, ఏఎన్ఎంలు, వైద్యులు గ్రామస్థాయి, సబ్సెంటర్ స్థాయి, పీహెచ్సీ స్థాయిలో ప్రణాళికలు వేసుకొని ప్రతి ఒక్కరికీ రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకునేలా చూడాలని ఆదేశించారు.
ఇదే సమయంలో ప్రజల్లో వ్యాక్సిన్పై ఉన్న అపోహలు, అనుమానాలు నివృత్తి చేయాలని, ప్రభుత్వ వైద్యం పై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని మరింత పెంచాలని అన్నారు. గర్భిణీ స్త్రీ లు, పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పులు పెరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. బీపీ, సుగర్, క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేపట్టాలని సూచించారు.