అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం ,తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాలను ఆలయంలో ఏకాంతంగా నిర్వహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఇవాళ సాయంత్రం వెంకన్న సన్నిధిలో శాస్త్రోక్తంగా అంకురార్పణ జరగనుంది.
కొవిడ్ నేపథ్యంలో భక్తులు, సిబ్బంది ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని గత ఏడాది తరహాలోనే ఈసారి కూడా వాహనసేవలను ఆలయంలోని కళ్యాణ వేదికలోనే నిర్వహించనున్నారు. వాహన సేవలు ఆలయంలో నిర్వహిస్తున్నప్పటికీ తిరుమలలో పండుగ వాతావరణం నెలకొనేలా కొద్దిపాటి ఏర్పాట్లు చేశారు. ఇవాళ సాయంత్రం జరిగే ధ్వజారోహణ కార్యక్రమంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు లాంఛనంగా ప్రారంభం కానున్నాయి.
సాయంత్రం 5.10 నుండి 5.30 గంటల మధ్య మీన లగ్నంలో శాస్త్రోక్తంగా ధ్వజారోహణం జరగనుంది.బ్రహ్మోత్సవాలలో మొదటిరోజు రాత్రి స్వామివారు పెద్ద శేష వాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. రాత్రి 8.30 నుండి 9.30 గంటల వరకు పెద్దశేషవాహన సేవ జరుగనుంది. 11వ తేదీన ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన గరుడసేవ జరగనుంది. గరుడసేవ రోజున స్వామివారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పట్టువస్త్రాలను సమర్పించనున్నారు. అనంతరం సీఎం జగన్ పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు