పంజా వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి హీరో హీరోయిన్లుగా పరిచయమవుతున్న చిత్రం ‘ఉప్పెన’. సుకుమార్ శిష్యుడైన బుచ్చిబాబు సానా ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ‘ఉప్పెన’కు దర్శకత్వం వహించడంతో పాటు కథ, స్క్రీన్ప్లే, సంభాషణలను కూడా బుచ్చిబాబే అందించారు. తమిళ స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతి ఓ కీలక పాత్ర పోషించిన ‘ఉప్పెన’ చిత్రానికి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ సహా అన్ని పనులూ పూర్తయ్యాయి. సానుకూల పరిస్థితులు ఏర్పడి, థియేటర్లు తెరుచుకోగానే చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాతలు సన్నద్ధంగా ఉన్నారు. ఈ చిత్రంలోని ‘రంగులద్దుకున్న’ పాటను సూపర్ స్టార్ మహేష్ బాబు బుధవారం సాయంత్రం 4:05 గంటలకు ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. ‘‘ఉప్పెన సినిమా నుంచి అందమైన మెలోడి ‘రంగులద్దుకున్న’ను విడుదల చేస్తున్నాను. నా ఫేవరేట్ రాక్స్టార్ దేవిశ్రీ ప్రసాద్కి, సుకుమార్ గారికి, వెండితెరకు పరిచయమవుతోన్న పంజా వైష్ణవ్ తేజ్కి, కృతి శెట్టికి, బుచ్చిబాబు సానాకు, మొత్తం చిత్ర బృందానికి శుభాకాంక్షలు’’ అని మహేష్ బాబు ట్వీట్లో పేర్కొన్నారు. ఇక పాట విషయానికి వస్తే దేవిశ్రీ ప్రసాద్ చాలా ప్లెజెంట్ ట్యూన్ ఇచ్చారు. శ్రీమణి మంచి సాహిత్యం అందించారు. యాజిన్ నిజార్, హరిప్రియ చాలా అందంగా ఆలపించారు.
previous post
next post