ఈరోజు రామభక్త హనుమాన్ జయంతి. ఉపద్రవాల నుండి కాపాడే ఆపద్భాందవుడు, కలవరపడి కరుణించమని అడిగిన వెంటనే కరిగిపోయి వరాలు కురిపించే ఏకైక దైవం, సాక్షత్తు అవతారమూర్తిని ఆదుకున్న అనంత బలశాలి .. రామ భక్తుడు శ్రీ ఆంజనేయుడు. బుద్ధిమాన్ద్యమును తొలగించి, చురుకు తనము కలిగించి మనస్సును ఉల్లాసంగా, ప్రశాంతంగా, శక్తివంతం గా చేసే దైవం హనుమాన్. అందుకనే విద్యా రంగం లో మంచి విజయాలు సాధించాలి అనుకునే వారు హనుమత్ ఉపాసన చెయ్యాలి. ఉపాసన అనగానే పెద్ద పెద్ద మంత్రాలు ఉపదేశం తీస్కోడం వాటిని అనేక నియమాల మధ్య జపాలు చెయ్యడం లాంటివి అనుకుని భయపడవద్దు. అర్చనాత్మక విధానమే చాలా శ్రేయస్కరం . స్వామి వారి అష్టోత్తర శతనామాలు , హనుమాన్ చాలీసా లు చాలా ప్రభావంగ పనిచేసి మనకి అంచనాలకి మించిన ఫలితాలను అందిస్తాయి.
హనుమాన్ జయంతి సందర్భంగా ఊరేగింపుగా హనుమాన్ భక్తులు..
“యత్ర యత్ర రఘునాథకీర్తనం – తత్ర తత్ర స్తుతమస్తకాంజలిమ్
భాష్పవారి పరిపూర్ణలోచనం – మారుతిం నమత రాక్షశాంతకామ్””
శ్రీరామ సంకీర్తన ఎక్కడెక్కడ జరుగునో, అక్కడక్కడ మారుతి ఆనందబాష్పములు నిండిన కళ్ళతో, చేతులు తలపై జోడించి నాట్యం చేస్తూ ఉండును” అని అర్థం. ఆంజనేయుడు బలానికి ధైర్యానికి, జ్ఞానానికి, సాహసానికి ప్రతిరూపంగా నిలచిన దైవం. శ్రీరాముని బంటుగా రాక్షస మూకకు, దుర్మార్గుల పాలిట యమునిగా తాను నమ్మిన భక్తులకు కొండంత అండగా నిలుస్తాడని చెబుతారు. సుగ్రీవుని దర్శించడానికి రామలక్ష్మణులు ఋష్యమూక పర్వతం సమీపిస్తున్నప్పుడు తొలిసారిగా వారికంట పడ్డాడు హనుమంతుడు. మరుక్షణంలో శ్రీరాముని హృదయం చూరగొన్నాడు. ఆ స్థితి ఆయన రామచంద్రుని కోరి పొందిన వరం. నిరంతరం రామనామ సంకీర్తనా తత్పరుడు మారుతి. అందుకే రామభక్తులలో ఆయనకొక్కనికే పూజార్హత లభించింది.