దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హీరో సుశాంత్ మృతి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో డ్రగ్స్ కోణం బయటపడింది. దీంతో దీనిపై ఫోకస్ చేస్తూ నార్కోటిక్స్ బృందం ఆ దిశగా దర్యాప్తు జరుపుతోంది. ఇప్పటికే రియా చక్రవర్తితో పాటు పలువురిపై కేసు నమోదు చేసిన ఎన్.సి.బి… రియా, సుశాంత్ మాజీ మేనేజర్ మిరాండా నివాసాల్లో తనిఖీలు జరుపుతోంది. ఇక మీడియాలో ఈ కేసుకు సంబంధించి వస్తున్న వార్తలను ఖండిస్తూ సీబీఐ కీలక ప్రకటన విడుదల చేసింది. ఈ కేసుకు సంబంధించి మీడియాకు ఎలాంటి వివరాలు ఇవ్వలేదని, సీబీఐ పేరుతో మీడియాలో వస్తున్న వార్తలు సరైనవి కావని స్పష్టం చేసింది. మరోవైపు… రియా చక్రవర్తి తండ్రి ఇంద్రజిత్ను సీబీఐ విచారించింది. వరుణ్ మాధుర్, రిషబ్ టక్కర్కు ఈడీ నోటీసులు పంపింది.
ఇక ఈ కేసును సీబీఐతో పాటు ఈడీ కూడా విచారణ చేస్తోందన్న విషయం తెలిసిందే. విచారణలో భాగంగా సుశాంత్ వ్యాపార సహచరుడు వరుణ్ మాథూర్ ని విచారించారు. అయితే ఈ విచారణలో వరుణ్ మాథూర్ సుశాంత్ కొన్ని కీలకమైన విషయాలను బయట పెట్టారు. భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని బయోపిక్ లో అదరగొట్టిన సుశాంత్.. అంతటితో ఆగకుండా ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ బయోపిక్ అతని డ్రీం ప్రాజెక్ట్ అని, దీనిని తన స్వీయ నిర్మాణంలో చేయాలనీ అనుకున్నాడని చెప్పుకొచ్చాడు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఒక సమావేశం కూడా జరిగినట్టుగా వెల్లడించాడు. గంగూలీతో పాటుగా మహత్మా గాంధీ, మదర్ థెరిస్సా, స్వామి వివేకానంద, రవీంద్రనాద్ ఠాగూర్ పాటు మొత్తం 12 పాత్రలతో ఓ సినిమా చేయాలని సుశాంత్ భావించినట్టుగా వరుణ్ మాథూర్ వెల్లడించారు.
కాగా రియాతో స్నేహం చేస్తున్న జాతీయ స్థాయి బిలియర్డ్స్ ప్లేయర్ రిషబ్ ఠక్కర్ను కూడా ఫెడరల్ ఏజెన్సీ ప్రశ్నించనుంది. సుశాంత్ మేనేజర్ దిశ ఆత్మహత్యపై కూడా దర్యాప్తు జరపనున్నారు. మాదకద్రవ్యాల డీలరుతో రియా చక్రవర్తి జరిపిన చాటింగ్ బండారం బయటపడటంతో ఈ కేసులో మాదకద్రవ్యాల కుట్ర కూడా ఉందనే అనుమానం వ్యక్తమయింది.దీంతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఇప్పటికే డ్రగ్ డీలర్ జైద్ విలాత్రాను అదుపులోకి తీసుకుంది. అతనికి ఈనెల 9వరకూ కోర్టు రిమాండ్ విధించింది.