లాక్డౌన్ అమలవుతున్న నేపథ్యంలో ఎందరో ప్రైవేట్ ఉద్యోగులతో పాటు చిరువ్యాపారస్థులు రోడ్డునపడ్డారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో కోర్టు పనులకు అంతరాయం ఏర్పడడంతో ఉపాధి కోల్పోయిన ఓ న్యాయవాది తనకు జీవనాధారం కల్పించాలని కోర్టు ఎదుట నగ్నంగా ఆందోళనకు దిగాడు. తమిళనాడులోని విరుదునగర్ జిల్లా సాత్తూరులో ఈ ఘటన జరిగింది.
ఆండాళ్పురానికి చెందిన మణికంఠన్ (36) ఉమ్మడి కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నాడు. అయితే, లాక్డౌన్ కారణంగా కోర్టు వ్యవహారాలు నిలిచిపోవడంతో ఆర్థికంగా పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. దీంతో ఏం చేయాలో దిక్కుతోచని మణికంఠన్ సాత్తూరు మెయిన్ రోడ్డులో ఉన్న కోర్టు ఎదుట నగ్నంగా కూర్చుని ఆందోళనకు దిగాడు. తనకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశాడు. విషయం తెలిసి రంగంలోకి దిగిన పోలీసులు కోర్టు వద్దకు చేరుకుని మణికంఠన్కు సర్దిచెప్పి ఆందోళన విరమింపజేశారు.