ఖైరతాబాద్ వినాయకుడి విగ్రహం బుధవారం నిమజ్జనం అవుతుందని తెలంగాణ పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. మంగళవారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని పండుగలకు ప్రాధాన్యమిస్తూ ముందుకు వెళుతున్నారని చెప్పారు.
ఖైరతాబాద్ వినాయకుడి విగ్రహం బుధవారం ఉదయం 12 గంటల వరకు ఎన్టీఆర్ మార్గ్ను చేరుతుందన్నారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం పూర్తి అవుతుందని తెలిపారు. కాగా మహాగణపతి పూర్తిగా నిమజ్జనం అయ్యేలా హెచ్ఎండీఏ అధికారులు హుస్సేన్ సాగర్లో పూడిక తీశారని పేర్కొన్నారు. హుస్సేన్ సాగర్ పరిసరాలతో పాటు వివిధ ప్రాంతాల్లో అధికారులు ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారన్నారు.