ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యకు పాల్పడ్డ సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఆయన నివాసంలో క్లూజ్టీం తనిఖీలు చేసింది. కోడెల సూసైడ్ చేసుకొన్న గదిని హైద్రాబాద్ పోలీసులు సోమవారం సీజ్ చేశారు. గదిలో కీలక ఆధారాల కోసం పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. కోడెల శివప్రసాదరావుది అనుమానాస్పతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఆత్మహత్యగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఆయన గదిలో ఎలాంటి సూసైడ్ నోట్ దొరకలేదని పోలీసులు చెప్పారు. కోడెల మృతిపై ప్రాథమికంగా ఎలాంటి అనుమానాలు లేవని, ఘటన సమయంలో ఇంట్లో కోడెల భార్య, కూతురు, పనిమనిషి ఉన్నారని తెలిపారు. కోడెల కొంతకాలంగా మనస్తాపంతో ఉన్నారని ఆయన కూతురు విజయలక్ష్మి పోలీసులకు స్టేట్ మెంట్ ఇచ్చారు. కోడెల మృతదేహాన్ని బసవతారకం ఆసుపత్రి నుంచి పోస్ట్మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. వైద్యుల నివేదిక తర్వాత కోడెల మృతిపై ప్రకటన చేస్తామని పోలీసులు స్పష్టం చేశారు.