ఎండలు అప్పుడే మండిపోతున్నాయి. దాహం వేసిందని నీళ్లు తాగినా తృప్తి ఉండదు. అటువంటి సమయంలో నీళ్లు కూడా తాగకపోతే సమస్యలు తప్పవు. అందుకే ఆ నీటిని కూడా శరీర అవసరాల మేరకు తయారు చేసుకొని తీసుకుంటుండాలి. ఈ కాలంలో తినాలి అని అనిపించడం తక్కువ, దానితో శీతల పానీయాలు తాగేస్తుంటారు కొందరు. అయినా దాహం తీరకపోగా కొత్త సమస్యలు తలెత్తుతాయి. దానికి పరిష్కారంగా ఈ కాలంలో లభ్యమయ్యే కీరదోస మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో అనేక రకములైన పోషక విలువలు దాగి ఉన్నాయి.
ఈ కీరదోసతో నీటితో కలిపి తీసుకుంటే, దాహార్తి తీరుతుంది. అలాగే మన చర్మ ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉన్నప్పుడు నీళ్లు ఎక్కువగా తాగాలి. లేదంటే డీహైడ్రేషన్ ఇబ్బంది పెడుతుంది. అలానే శరీరంలో వ్యర్దాలు చేరిపోయి రకరకాల సమస్యలు ఎదురవుతాయి.
వాటిని దూరం చేసుకోవాలంటే పుదీనాతో ఇలా చేసి చూడండి. ఓ సీసాలో నీళ్లు తీసుకొని, అందులో కీరదోస ముక్కలు, రెండు చక్రాల్లా తరిగిన నిమ్మముక్కలు నాలుగు, పుదీన ఆకులు వేసి రాత్రి పూట ఉంచాలి. కీరదోస నీళ్లను వేసవికాలంలో రోజూ ఆరు గ్లాసులు తీసుకోవాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
కీరదోస నీళ్లను రోజూ తీసుకుంటే డీహైడ్రేషన్ సమస్య రాకుండా వుంటుంది. నీళ్లలో కీర ముక్కలను రోజుకంటే ఎక్కువ ఉంచకూడదు. కావాలనుకుంటే రుచి కోసం నిమ్మరసం కలుపుకోవచ్చు. ఈ నీటిని తాగిన తర్వాత కీరదోస ముక్కల్ని కూడా తినేయవచ్చు.
కీరదోస నీటిని సేవించడం ద్వారా చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఈ నీరు బరువు తగ్గించడంలో భేష్గా పనిచేస్తుంది. ఆకలిగా ఉన్నప్పుడు కీరదోస నీటిని సేవిస్తే పొట్టనిండిన భావన కలుగుతుంది. ఈ నీటిలో పుష్కలంగా ఉండే విటమిన్-కె, మాంసకృత్తులు, ఎముకలకు బలాన్నిస్తాయి.