ఆన్లైన్లో సైబర్ నేరగాళ్ల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. వీరి ఉచ్చులో పడి సామాన్య ప్రజలతో పాటు ఉన్నత చదువులు చదివినవారు, ఉన్నతోద్యోగులు సైతం మోసం పోతున్నారు. తాజాగా సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్.ఎం.లోధా కూడా హ్యాకర్ల వలలో పడ్డారు. తన సహోద్యోగి జస్టిస్ బి.పి.సింగ్ ఈమెయిల్ నుంచి తనకు ఒక రూ.లక్ష కావాలంటూ మెయిల్ వచ్చింది. తన బంధువు ఒకరు ఆసుపత్రిలో ఉన్నారని.. వారి చికిత్స నిమిత్తం డబ్బు సర్దాలని సందేశ సారాంశం. వీరివురు తరచూ మెయిల్ ద్వారా సంభాషించుకుంటుంటారు. దీనితో లోధా తనకు వచ్చిన సందేశం నిజమేననుని భావించి వెంటనే మెయిల్లో పేర్కొన్న బ్యాంకు ఖాతాలో డబ్బు జమ చేశారు.
బి.పి.సింగ్ మెయిల్ నుంచి నాకు ఒక సందేశం వస్తే, రెండు దఫాల్లో డబ్బు జమ చేశాను.. అని లోధా జరిగిన విషయాన్ని తెలిపారు. తన మెయిల్ ఐడీ హ్యాకర్ల బారి నుంచి బయటపడగానే.. మే 30న బి.పి.సింగ్ మిత్రులందరికీ తన మెయిల్ ఐడీ హ్యాక్ అయినట్లు సందేశం పంపారు. దీన్ని చదివిన లోధా డబ్బు జమ చేసిన విషయాన్ని సింగ్కు వివరించారు. తాను అలాంటి సందేశం పంపలేదని.. అది హ్యాకర్ల పనేనని సింగ్ చెప్పారు. దీంతో తన మిత్రుల సలహాతో లోధా గత శనివారం తాను నివాసం ఉంటున్న సౌత్ దిల్లీ పంచశీల్ పార్క్ పరిధిలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.