ప్రముఖ బాలీవుడ్ చిత్ర నిర్మాత రాజ్ కుమార్ బార్జ్యాత్య ఈరోజు ఉదయం ముంబైలోని హెచ్.ఎన్. రిలయన్స్ ఫౌండేషన్ ఆసుపత్రిలో కన్నుమూశారు. రాజ్ కుమార్ తన భార్య సుధా బర్జాత్య, కొడుకు సూరజ్ బర్జాత్యలతో కలిసి నివసించేవారు. ఆయన మరణించిన విషయాన్ని ప్రముఖ బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరన్ ఆదర్శ్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. కొన్నిరోజుల క్రితమే ప్రభాదేవి ఆఫీసులో రాజ్ కుమార్ గారిని కలిశానని, అప్పుడు ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని, కానీ ఇప్పుడు ఆకస్మాత్తుగా ఆయన చనిపోయారన్న విషయాన్నీ జీర్ణించుకోలేకపోతున్నాను అంటూ తరన్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న బాలీవుడ్ ప్రముఖులు ఆయనకు సంతాపం తెలుపుతున్నారు.
రాజ్ కుమార్ రాజశ్రీ ప్రొడక్షన్స్ పై పలు చిత్రాలను నిర్మించారు. మైనే ప్యార్ కియా, హమ్ ఆప్ కే హై కౌన్, వివాహ్, ప్రేమ్ రతన్ ధన్ పాయో, హమ్ సాత్ సాత్ హ’ చిత్రాలు నిర్మాతగా ఆయనకి మంచి పేరు తీసుకొచ్చాయి. హమ్ ఆప్ కే హై కౌన్ చిత్రానికి గాను ఆయన ఫిలిం ఫేర్ అవార్డు ని అందుకున్నారు. ఆయన నిర్మించిన ఆఖరి చిత్రం “హమ్ చార్”. ఈ చిత్రం ఫిబ్రవరి 15, 2019 లో విడుదలైంది.