తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ పరువు హత్య కేసులో నిందితులకు తెలంగాణ హైకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితులైన అమృత తండ్రి మారుతీరావు, ఆయన సోదరుడు శ్రవణ్కుమార్, మరో నిందితుడు కరీంలకు నిన్న న్యాయస్థానం బెయిల్ ఇచ్చింది.
ఈ వ్యవహారంపై ప్రణయ్ భార్య అమృత స్పందించారు. తన బాధను ఎవ్వరూ అర్థం చేసుకోలేదని అమృత ఆవేదన వ్యక్తం చేశారు. నడిరోడ్డుపై పట్టపగలు హత్య చేయించిన వ్యక్తికి బెయిల్ ఎలా మంజూరు చేస్తారని ప్రశ్నించింది. తన తండ్రి బయటకు రావడంతో, తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. తమకు సెక్యూరిటీని పెంచాలని జిల్లా ఎస్పీని కోరింది. బెయిల్ పై అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని తెలిపింది.