సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇండియా సైన్స్ పేరుతో దూరదర్శన్ రెండు కొత్త చానళ్లను ప్రారంభించింది. డీడీ సైన్స్ పేరుతో ఒక చానల్ను, ఇండియా సైన్స్ పేరుతో వెబ్ చానల్ను దూరదర్శన్ అందుబాటులోకి తెచ్చింది. కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి హర్షవర్దన్ మంగళవారం వీటి ప్రసారాలను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ భారత్లో ఆలోచనలకు, ప్రతిభకు, సమర్థతకు కొదువ లేదనీ, 2030 నాటికి శాస్త్ర, సాంకేతిక రంగాల్లో భారత్ ప్రపంచంలో తొలి మూడు దేశాల్లో ఒకటిగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
శాస్త్రీయ దృక్పథం అభివృద్ధికి ఓ చానల్ అత్యవసరమని అందుకు డీడీ సైన్స్ 24/7 చానల్ను సైన్స్కు అంకితమిస్తునట్లు తెలిపారు. దూరదర్శన్ జాతీయ చానల్లో ఒక గంటపాటు డీడీ సైన్స్ చానల్ కార్యక్రమాలుంటాయని, ఇండియా సైన్స్ చానల్ మాత్రం ఇంటర్నెట్ ఆధారిత చానల్ అని పేర్కొన్నారు. దేశంలో వాటర్ షెడ్ ఉద్యమం కేవలం సైన్స్ అండ్ టెక్నాలజీ కమ్యూనికేషన్కే పరిమితం కాదని సమాజంలో అభివృద్ధి చెందిన శాస్త్రీయ దృక్పథానికి ఆ ఉద్యమం నిదర్శనమన్నారు.