దీపావళి పండుగకు ముందు ధన త్రయోదశి జరుపుకుంటాము. బంగారం, వెండి వంటి వాటితో లక్ష్మీదేవిని పూజిస్తే సర్వ శ్రేయస్కరం అని ఉత్తరాది సాంప్రాదాయం. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇది కొనసాగుతుంది. దీనితో బంగారం వ్యాపారాలు పలు ఆఫర్లతో సిద్ధమయ్యారు. గత సంవత్సరం దీపావళి పండుగ సమయానికి గ్రాము మేలిమి బంగారం ధర రూ. 3 ,200 – రూ. 3, 300 వరకు ఉంది. ఇప్పుడు రూ. 3, 900గా ఉంది. ధర మరీ ఎక్కువగా ఉండడం, ఆర్థిక మందగమనంతో బంగారం వ్యాపారం అంతగా కళకళలాడదని విశ్లేషకులు అంటున్నారు.
పాత బంగారం తెచ్చి..అదే బరువుకు సమానమైన కొత్త ఆభరణాలు తీసుకెళ్లండి అంటూ విక్రయసంస్థలు ప్రకటనలు గుప్పిస్తున్నాయి. అయితే..పాత బంగారం ఇస్తే..వారికి ఏం లాభం అనే చిన్న డౌట్ కూడా వస్తుంది. తరుగు, మజూరీ ఛార్జీల రూపంలో వారికి ఆదాయం వచ్చే అవకాశం ఉంది. పాత ఆభరణాన్ని ముందుగా పరీక్ష చేస్తారు. ఆ బంగారం ఖచ్చితంగా 22 క్యారెట్లుతో ఉండడం..ఇతర వాటిని పరిగణలోకి తీసుకుని విలువ లెక్క కడుతారు. తరుగు కింద ఆభరణం డిజైన్కు అనుగుణంగా 4 నుంచి 30 శాతం వరకు, అత్యధిక ఆభరణాలకు 18 నుంచి 28 శాతం తరుగు వేస్తారు. ఇది రూ. 26 వేల నుంచి రూ. 40 వేల దాక ఉంటుందని అంచనా. ఇలాంటి విషయాల్లో కొంత జాగ్రత్తలు తీసుకుని ఆభరణాలు కొనుగోలు చేస్తే మేలు.