వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు విరుచుకుపడ్డారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవి నుంచి నిమ్మగడ్డ రమేశ్ ను ఇష్టానుసారంగా తప్పించారని మండిపడ్డారు. ప్రభుత్వం రాజ్యాంగస్ఫూర్తికి విరుద్ధంగా జీవోలు తెచ్చిందని విమర్శించారు. ఈ వ్యవహారంలో వైసీపీ ప్రభుత్వానికి కోర్టులో మొట్టికాయలు తప్పవని దేవినేని వ్యాఖ్యానించారు. తప్పుడు జీవోలకు గవర్నర్ కార్యాలయం వంతపాడరాదని ఆయన పేర్కొన్నారు.
మీడియా ముందుకు వచ్చి నిజాలు చెప్పే ధైర్యం సీఎంకు లేదని విమర్శించారు. లాక్ డౌన్ ఎత్తివేస్తామన్న సీఎం జగన్ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంతో కూడుకున్నవని మండిపడ్డారు. పరిపాలన చేతకావడంలేదని జగన్ చెప్పాలని దేవినేని ఉమ డిమాండ్ చేశారు. బాధ్యతగల నేతగా చంద్రబాబు రాష్ట్రానికి అనేక సూచనలు చేస్తున్నారన్నారు. తెలంగాణ నుంచి వచ్చిన ఏపీ విద్యార్థులను క్వారంటైన్ లో పెట్టారని, కానీ చెన్నై నుంచి వచ్చిన కనగరాజ్ ను ఎందుకు క్వారంటైన్ లో పెట్టలేదని ప్రశ్నించారు.