telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఏమిచేసినా ఆత్మ సంతృప్తి కోసమే : మెగాస్టార్

chiru

దాసరి నారాయణరావు మరణం తరువాత దిశానిర్దేశం చేసే పెద్ద దిక్కు లేక దిక్కు తోచని స్థితిలో ఉన్న తెలుగు సినీ పరిశ్రమకు అన్ని విధాలుగా  పెద్దన్న బాధ్యత తీసుకున్నారు చిరంజీవి. సినిమా ఇండస్ట్రీలో జరిగే మంచి చెడులను గమనిస్తూ పెద్దరికంగా సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు వెళ్తున్నాడు మెగాస్టార్. ఈ లాక్‌డౌన్ సమయంలో తెలుగు సినిమా పరిశ్రమను నమ్ముకుని రోజువారీ వేతనాలతో ఇబ్బంది పడుతున్న వారిని ఆదుకొనే ఆలోచన చేశారు. కరోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ) స్థాపించి తన ఆలోచనను ఆచరణలో పెట్టారు. చిరంజీవి అలా సీసీసీ స్థాపించిన కొన్ని గంటల్లోనే సినిమా ఇండస్ట్రీలోని అనేక మంది ప్రముఖులు తమ స్థాయి, స్తోమతకు తగ్గట్టుగా ఆర్థిక సహాయం అందించారు. అయితే ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో చిరంజీవి ఈ విషయం గురించి మరింత వివరంగా మాట్లాడారు. ఏదో ఒక్క నెల సాయం చేసి ఆపెయ్యాలి అనే ఆలోచన తమకు లేదు అని, లాక్ డౌన్ ఉన్నంత కాలం, తిరిగి షూటింగ్స్ మొదలయ్యేవరకు.. అది రెండు నెలలు అయినా, నాలుగు నెలలు అయినా సీసీసీ తరఫున సాయం అందిస్తామని చిరంజీవి స్పష్టం చేశారు. లాక్‌డౌన్ వల్ల సినిమా ఇండస్ట్రీలోని ఏ ఒక్కరూ పస్తులు ఉండడానికి వీలు లేదు అని చిరంజీవి చెప్పారు. దానికోసం అవసరమయితే ఎవరిముందుకు వెళ్ళి సాయం అడగడానికి అయినా వెనుకాడను అని చెప్పారు. ఇప్పటివరకు ఎవరినీ ఇది కావాలి అని అడగని తాను ఇప్పుడు మాత్రం ఆడుగుతానని చెప్పుకొచ్చారు.

తాజాగా సోషల్ మీడియాలో తన ఎంట్రీ గురించి కూడా చిరంజీవి ప్రస్తావించారు. నిజానికి దిశా సంఘటన సమయంలో తన హృదయం ద్రవించిపోయిందన్నారు. కానీ, తన భావాలను పంచుకోవడానికి అప్పుడు సరైన వేదిక లేదని ఫీలయ్యానని చెప్పారు. అందుకే ఈ సమయంలో సోషల్ మీడియాలోకి వస్తే తాను చెప్పాలనుకున్న మెసేజ్ నేరుగా అభిమానులకు చేరే అవకాశం ఉంట్టుంది కాబట్టి ట్విట్టర్ ఖాతా ఓపెన్ చేసినట్టు చెప్పారు చిరంజీవి. ప్రస్తుతం టాలీవుడ్‌లో ‘బి ద రియల్ మ్యాన్’ ఛాలెంజ్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటోన్న మగాళ్లు.. ఆడవాళ్లకు తమవంతు సాయం చేయాలనేది ఈ ఛాలెంజ్ సారాంశం. ఈ ఛాలెంజ్‌లో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ చిరంజీవిని నామినేట్ చేశారు. ఈ పిలుపు మేరకు ఇంట్లో స్వయంగా పనులు చేసి ఆ వీడియోను కూడా చిరంజీవి ట్వీట్ చేశారు. ఇదేకాదు, ఇంట్లో తాను చేస్తున్న పనులకు సంబంధించి చాలా వీడియోలు పెడుతూ అందరిలో స్ఫూర్తి నింపుతున్నారు. లాక్‌డౌన్ వల్ల అన్ని బ్లడ్ బ్యాంక్స్‌లో రక్త నిల్వలు తగ్గిపోతున్నాయి. ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని రక్షించడానికి రక్తం దొరకని పరిస్థితి. అందుకే చిరంజీవి ముందుకు వచ్చి స్వయంగా రక్తదానం చేసి ఈ క్లిష్ట పరిస్థితిలో అందరూ రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. దీంతో అనేకమంది ముందుకు వచ్చి రక్తం ఇచ్చారు. ఇటీవల గుంటూరుకు చెందిన తన వీరాభిమాని రాజనాల నాగలక్ష్మి ఆరోగ్యం విషమించింది అని తెలుసుకుని ఆమెని హైదరాబాద్ రప్పించి స్టార్ హాస్పిటల్స్‌లో ఆపరేషన్ చేయించారు. గుండె ఆపరేషన్ అనంతరం ప్రస్తుతం ఆమె సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు. అయితే ఈ వార్త తెలియగానే తనకు కలిగిన ఆనందం మాటల్లో చెప్పలేను అని, ఇలాంటివన్నీ ఆత్మ సంతృప్తి కోసమే చేస్తాం చెప్పుకొచ్చారు చిరంజీవి.

Related posts