తెలంగాణ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష (సీఎల్పీ) నేతగా మల్లు భట్టి విక్రమార్కను అధిష్టానం నియమించింది. ఈ మేరకు ఎఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పదవి కోసం పీసీసీ చీఫ్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి, డి.శ్రీధర్ బాబు తదితరులు పోటీపడ్డారు. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్టానం ఓ లేఖను విడుదల చేసింది.
అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణుల్లో సీఎల్పీ నేత ఎంపికపై ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ నాయకులు సీఎల్పీ నేత ఎంపికను పూర్తిగా అధిష్టానానికే వదిలేశారు. భట్టి విక్రమార్కను సీఎల్పీ నేతగా రాహుల్ గాంధీ కొద్దిసేపటి క్రితమే నియమించినట్లు ప్రకటించారు. భట్టి విక్రమార్క ప్రస్తుతం మధిర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.