ఇళ్ల నిర్మాణంలో కూడా రానురాను అనేక సరికొత్త మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వాడే వస్తువుల దగ్గర నుండి అనేక విషయాలలో చాలా మార్పులు వచ్చేస్తున్నాయి. మట్టి ఇటుకలు, సిమెంట్ ఇటుకలు, యాష్ ఇటుకలు.. అంటూ చాలా మార్పులు వచ్చేశాయి. వీటిలో కొన్ని ధరల విషయంలోను, మరికొన్ని పర్యావరణానికి హానిలేనివి అంటూ ప్రజాదరణ కూడా పొందుతూనే ఉన్నాయి.
తాజాగా జనపనారతో ఇటుకలు అంటున్నారు.. అదికూడా కాస్త పరవాలేదు అనుకోవచ్చేమో.. ఇంకో అడుగు ముందుకు వేసి, గంజాయి తో కూడా ఇటుకలు అంటున్నారు. గంజాయా .. ఆ మాట వినగానే పోలీసులు.. గుర్తొస్తున్నారు కదూ. కానీ ఇది నిజమేనండి, గంజాయితో ఇటుకలు తయారీ జరుగుతుంది. అది ప్రజాదరణ కూడా పొందుతుందట.. అంతబాగానే ఉంది కానీ, మరి ఇటుకలు తయారీకి గంజాయి పండించాలి కదా.. దానికి అనుమతులు గట్రా ఏమిటో.. అంటూ ఉత్పత్తి కోసం కొందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు, ఒకపక్క ఇటుకలకోసం అంటూనే.. మరోపక్క చక్కగా మాదకద్రవ్యాలు ఇష్టానుసారంగా చేసేసుకోవచ్చు. ఆ అయినా పర్యావరణ హితం కోసమే గంజాయి ఇటుకలు అంటున్నారు.. చూద్దాం ఎంతవరకు హితమో..! ఈ ఇటుకలు పర్యావరణ హితంగా భవన నిర్మాణానికి ఉపయోగపడుతున్నాయట. గంజాయి, జనపనార పుప్పొడితో రూపొందించిన ఇటుకలు జాతీయస్థాయిలో ఆకట్టుకొంటున్నాయి. సోమవారమిక్కడ కేంద్ర విద్యుత్తు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఒక సదస్సులో విశాఖకు చెందిన గ్రీన్జామ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎల్ఎల్పీ సంస్ధ వీటిని ప్రదర్శించింది.