తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు చిన్నాచితక గ్రామాలను కలుపుకుని, రాష్ట్రంలో మరిన్ని నగరాలు, పట్టణాలు ఏర్పాటు చేసుకోవచ్చంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీలకు ఆనుకుని ఉన్న గ్రామాలను విలీనం చేసేందుకు మునిసిపల్ కార్పొరేషన్ చట్టంలో ప్రభుత్వం చేసిన సవరణలకు వ్యతిరేకంగా 120కి పైగా పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిని వ్యతిరేకించిన చాలా గ్రామాలు హైకోర్టును ఆశ్రయించాయి. ఈ పిటిషన్లను విచారించిన హైకోర్టు వాటిని కొట్టివేసింది.
చీఫ్ జస్టిస్ టీబీ రాధాకృష్ణన్, జస్టిస్ ఎ.రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలోని హైకోర్టు బెంచ్ వాటిని కొట్టివేసింది. శాసన పరిధిలో ఇటువంటి సవరణలు చేసే అధికారం ప్రభుత్వానికి ఉందని ధర్మాసనం తేల్చి చెప్పింది. హైకోర్టు తీర్పుతో తెలంగాణ సర్కారుకు ఊరట లభించింది. దీంతో రాష్ట్రంలో మరిన్ని కొత్త పట్టణాల ఏర్పాటుకు మార్గం సుగమమైంది.