ఏనుగుల సంచారంపై ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు జారీ చేశారు.
అటవీ ప్రాంతాలను ఆనుకొని ఉన్న గ్రామాలలోకి ఏనుగులు ప్రవేశించే పరిస్థితులు ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉన్నప్పుడు ముందస్తు హెచ్చరికలు చేయాలన్నారు.
ఈ ప్రక్రియను మరింత పెంచాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. కుప్పం మండలంలోని వెంకటేశ్వరపురం గ్రామంలో కిట్టయ్య అనే వ్యక్తి ఏనుగు దాడిలో మరణించిన ఘటనపై పవన్ స్పందించారు.
ఈ ఘటనపై పీసీసీఎఫ్, సంబంధిత అధికారులతో ఈరోజు (గురువారం) ఉదయం డిప్యూటీ సీఎం చర్చించారు.
కిట్టయ్య కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆ కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయాన్ని సత్వరమే అందించాలని ఆదేశాలు జారీ చేశారు.
తమిళనాడు అటవీ ప్రాంతం వైపు నుంచి వచ్చిన ఏనుగు మూలంగా ఈ ఘటన చోటు చేసుకుందని, అక్కడ కూడా సదరు ఏనుగు మూలంగా మరణాలు సంభవించాయని పవన్కు అటవీ శాఖ అధికారులు వివరించారు.
మన రాష్ట్ర అటవీ ప్రాంతంలోకి వస్తోందని ట్రాక్ చేసిన వెంటనే సమీప గ్రామాల వారికి ముందుగానే తెలియచేశామని చెప్పారు.
ముందస్తు హెచ్చరికలను మరింత విస్తృతం చేయాలి అని పవన్ కల్యాణ్ అన్నారు.
గ్రామాలవారీగానూ, రైతులతోనూ సోషల్ మీడియా గ్రూప్స్ ఏర్పాటు చేసి వాటికి టెక్స్ట్ మెసేజ్లతో పాటు, వాయిస్ మెసేజ్లు కూడా పంపిస్తే సమాచారం తొందరగా చేరుతుందని అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచనలు చేశారు.

