కరోనా దెబ్బకు పలు దేశాలు ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్నాయి. అమెరికాలో లక్షలాది మంది ఉద్యోగాలను కోల్పోయారు. ఈ నేపథ్యంలో అధ్యక్ష ఎన్నికలను ఎదుర్కోవాల్సిన డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. హెచ్-1బీ వీసాలను తాత్కాలికంగా రద్దు చేస్తూ, మెరిట్ ఆధారిత వీసాలను జారీ చేయాలని కార్యనిర్వాహక అధికారులను అదేశించారు.మెరిట్ ఆధారిత ఇమిగ్రేషన్ వ్యవస్థలోకి మారుతున్నామని వైట్ హౌస్ ఓ మీడియా ప్రకటనలో పేర్కొంది.
అధ్యక్షుడి ఆదేశాల మేరకు హెచ్-1బీ వీసాలు, ఇతర వర్క్ వీసాలను ఈ సంవత్సరం చివరి వరకూ సస్పెండ్ చేస్తున్నట్టు వెల్లడించింది. మొత్తం ఇమిగ్రేషన్ వ్యవస్థను సంస్కరించి, అత్యధిక నైపుణ్యంగల వారికి మాత్రమే ప్రాధాన్యతనిస్తూ, అమెరికన్ల ఉద్యోగాలను కాపాడుతామని వైట్ హౌస్ పేర్కొంది.
తాజా నిర్ణయాల ప్రకారం, హెచ్-1బీ వీసాల జారీలో అమెరికాకు వచ్చే వారికి ఆయా సంస్థలు అత్యధిక వేతనాన్ని ఆఫర్ చేయాల్సి వుంటుంది. అంటే, సదరు ఉద్యోగి అమెరికాలో ఎంతో అవసరమని కంపెనీలు భావించాల్సివుంటుందని శ్వేతసౌధం తెలిపింది. సమయంలో చట్టాల్లోని లొసుగులను సైతం సవరించాలని నిర్ణయించినట్టు అధికారులు తెలిపారు. ఈ సంస్కరణలతో అమెరికన్ ఉద్యోగుల వేతనాలు రక్షించబడతాయని అధికారులు పేర్కొన్నారు.