*బీజేపీ సభ్యులు ఈటల రాజేందర్, రాజాసింగ్, రఘునందన్రావులపై సస్పెన్షన్ వేటు
*తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ముగిసేవరకూ బీజేపీ సభ్యుల సస్పెన్షన్
* తెలంగాణ అసెంబ్లీ నుంచి బీజేపీ సభ్యులు సస్పెన్షన్
తెలంగాణ అసెంబ్లీ లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. గవర్నర్ ప్రసంగం లేకుండా బడ్జెట్ సమావేశాలను ప్రారంభించిన ప్రభుత్వం వైఖరిపై బీజేపీ సభ్యులు నల్ల జెండాలు ధరించి అసెంబ్లీలోకి ప్రవేశించారు. శాసన సభలో మంత్రి హరీశ్రావు బడ్జెట్ ప్రవేశపెడుతుండగా..బీజేపీ సభ్యులు ఆందోళనలు ప్రవేశపెట్టారు.
బడ్జెట్ సమావేశాల్లో ఆర్థిక మంత్రి హరీశ్ రావు ప్రసంగాన్ని అడ్డుకుంటున్న బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాలంటూ.. మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తీర్మానం ప్రవేశపెట్టగా.. సభ ఆమోదించింది.
బీజేపీ సభ్యులు ఈటెల రాజేందర్, రఘునందన్ రావును సస్పెండ్ చేస్తూ తెలంగాణ అసెంబ్లీ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రకటన చేశారు. ఈ సెషన్ పూర్తయ్యే వరకు భాజపా సభ్యులను సస్పెండ్ చేస్తున్నట్లు వెల్లడించారు. సభ నుంచి బయటకు వెళ్లాలని సూచించారు.
అసెంబ్లీ సమావేశాల నుంచి బయటకు వచ్చిన బీజేపీ ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. నల్ల కండువాలతో అసెంబ్లీ ముందు బైఠాయించి నిరసన తెలుపారు. రాష్ట్రంలో రాజ్యాంగం విరుద్ధంగా పాలన కొనసాగుతుందని ఎమ్మెల్యేలుధ్వజమెత్తారు.సభలో మాట్లాడే హక్కు కూడా లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు.
మరోవైపు ..తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా కొనసాగుతున్న మంత్రి హరీష్ రావు ప్రసంగాన్ని తెలంగాణ కాంగ్రేస్ పార్టీ బహిష్కరించింది.

