telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

శాంతీ.. నీ భర్త ఎవరు?

*సస్పెండ్‌ అయిన దేవాదాయ శాఖ సహాయ కమిషనర్‌ శాంతిపై కొత్తగా మరో 6 అభియోగాలు నమోదయ్యాయి.

*గతంలో వచ్చిన ఆరోపణలపై 9 అభియోగాలు మోపి ఆమెను సస్పెండ్‌ చేశారు.

*తాజాగా మీ భర్త ఎవరో చెప్పాలని కోరడంతో పాటు సంబంధిత ఆరోపణలపై 15 రోజుల్లో సమాధానం చెప్పాలని శాంతికి నోటీసులు జారీ చేశారు.

*ఈ మేరకు దేవాదాయ శాఖ కమిషనర్‌ సత్యనారాయణ తాఖీదు జారీ చేశారు.

ఇప్పటికే వివిధ ఆరోపణలతో ఉద్యోగం నుంచి సస్పెన్షన్‌కు గురైన దేవాదాయశాఖ సహాయ కమిషనర్‌ శాంతిపై మరో 6 అభియోగాలు నమోదయ్యాయి.

ఇటీవల ఆమె నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రస్తావించిన అంశాలు, ఉమ్మడి విశాఖ జిల్లాలో సహాయ కమిషనర్‌గా ఉన్నప్పుడు చేసిన ఉల్లంఘనలకు సంబంధించి కొత్తగా ఆరు అభియోగాలు మోపారు.

దేవాదాయశాఖలో 2020 లో ఉద్యోగంలో చేరినప్పుడు భర్త పేరు కె.మదన్‌మోహన్ అని శాంతి సర్వీస్‌ రిజిస్టర్‌లో నమోదు చేయించారని, గత ఏడాది జనవరి 25వ తేదీన ప్రసూతి సెలవుల కోసం దరఖాస్తు చేసినప్పుడు కూడా భర్త పేరు మదన్‌మోహన్‌ అని పేర్కొన్నారని దేవాదాయశాఖ కమిషనర్‌ సత్యనారాయణ తెలిపారు.

కానీ ఈ నెల 17న నిర్వహించిన విలేకరుల సమావేశంలో పి.సుభాష్‌ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్లు తెలిపారని, విడాకులు తీసుకోకుండా రెండో పెళ్లి చేసుకోవడం ఉద్యోగి ప్రవర్తనా నియమావళికి విరుద్ధమని మొదటి అభియోగం మోపారు.

ఆమె తీరుతో దేవాదాయశాఖ ప్రతిష్టకు భంగం కలిగించారంటూ రెండో అభియోగం మోపారు.

కమిషనర్ అనుమతి లేకుండా విలేకరుల సమావేశంలో మాట్లాడటంపై మరో అభియోగం నమోదు చేశారు.

“ఎప్పుడు ఎలా మాట్లాడాలో మీకు బాగా తెలుసు సర్, మీరు పార్టీకి వెన్నెముక” అంటూ ఎంపీ విజయసాయిరెడ్డి గురించి గత ఏడాది మే 28న ట్వీట్ చేశారని, ఇది ఆ పార్టీతో ఉన్న అనుబంధాన్ని సూచిస్తోందని నోటీసుల్లో సత్యనారాయణ పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగిగా ఇది నిబంధనలకు విరుద్ధమని అభియోగంలో తెలిపారు.

విశాఖలో నివాసం ఉన్నప్పుడు అపార్ట్‌మెంట్‌లోని మరో ప్లాట్లోని వారితో గొడవపడగా, 2022 ఆగస్టులో ఆరిలోవ పోలీస్‌ స్టేషన్లో నమోదైన కేసుపై వివరణ ఇవ్వాలని కోరారు.

శాంతికి అధికారం లేకపోయినా సరే ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలో అనకాపల్లిలో సిద్ధేశ్వరస్వామి ఆలయం, చోడవరంలో విఘ్నేశ్వర ఆలయం, హార్డేంజ్ రెస్ట్‌హౌస్‌, లంకెలపాలెం పరదేశమ్మ ఆలయం, పాయకరావుపేట పాండురంగస్వామి ఆలయం, ధారపాలెం ధారమల్లేశ్వరస్వామి ఆలయాలకు చెందిన దుకాణాలు, భూముల లీజులను 3 ఏళ్లకు బదులు 11 ఏళ్లకు రెన్యువల్‌ చేసేలా కమిషనర్‌కు ప్రతిపాదనలు పంపడం, అవి రెన్యువల్‌ కావడంపై వివరణ కోరుతూ అభియోగం మోపారు. వీటన్నింటిపై 15 రోజుల్లో వివరణ ఇవ్వాలన్నారు.

మరోవైపు శాంతి సహాయ కమిషనర్‌గా పని చేసినప్పుడు విశాఖ, అనకాపల్లి, ఎన్టీఆర్ జిల్లాల పరిధిలో ఇంకా ఏయే ఉల్లంఘనలకు పాల్పడ్డారు? భూములు, దుకాణాల లీజుల్లో ఏం చేశారు? ఆలయాల భూములు పరాయిపరం చేసేలా ఎన్​వోసీల జారీకి సిఫార్సులు చేశారా? అనేవి పరిశీలించేందుకు ముగ్గురు అధికారులతో కమిటీ వేయనున్నారు.

Related posts