తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలకు పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక సూచనలు చేశారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై జరుగుతున్న తప్పుడు ప్రచారాలను సమర్థవంతంగా తిప్పికొట్టాలని ఆయన ఆదేశించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాల అమలు తీరు, ప్రజల నుంచి వస్తున్న స్పందనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ముఖ్యంగా అన్నదాత సుఖీభవ పథకంపై నిర్వహించిన ర్యాలీలు, ప్రచార కార్యక్రమాల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఉచిత బస్సు ప్రయాణ సేవలకు (స్త్రీశక్తి పథకం) అన్ని ప్రాంతాల్లో ప్రజల నుంచి విశేషమైన స్పందన లభిస్తోందని పార్టీ విభాగాల ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించారు.
దీనిపై సంతోషం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి.. ప్రజల్లో పథకాలపై పెరుగుతున్న విశ్వాసం ప్రభుత్వానికి మరింత మేలు చేస్తుందని అన్నారు.
వైసీపీ, అనుబంధ మీడియా ఉచిత బస్సు పథకం విషయంలో తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని, వాస్తవాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నేతలకు చంద్రబాబు సూచించారు.
పథకాల అమలులో ఎమ్మెల్యేలు, మంత్రులు పూర్తి స్థాయిలో భాగస్వామ్యం కావాలని స్పష్టం చేశారు.
ప్రజలతో మమేకం అవ్వడం ద్వారానే ప్రభుత్వ పథకాలకు విశ్వసనీయత పెరుగుతుందని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.