ఇటీవల తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో డబుల్ బెడ్రూం ఇళ్లపై టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుధ్ధం జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అనూహ్యరీతిలో స్పందించారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఇంటికి వెళ్లి ఆయనను స్వయంగా తీసుకెళ్లి డబుల్ బెడ్రూం ఇళ్లు చూపించారు. తాను ఇంత చేస్తున్నా కాంగ్రెస్ నేతల నుంచి విమర్శలు ఆగడంలేదని తాజాగా తలసాని అన్నారు.
కాంగ్రెస్ నేతల సవాల్ ను స్వీకరించి, వారిని డబుల్ బెడ్రూం ఇళ్ల వద్దకు తీసుకెళితే లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇళ్ల పరిశీలన సమయంలో తాను ముందు నడస్తుంటే వెనుక నుంచి కాంగ్రెస్ నేతలు కామెంట్లు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఆ కామెంట్లు తట్టుకోలేక వారిని వెళ్లిపొమ్మని చెప్పానని పెద్దపల్లి జిల్లా పర్యటనలో వివరణ ఇచ్చారు.