కరోనా వైరస్ చాపాకింద నీరులా తన ప్రభావాన్ని విస్తరింపజేస్తుంది. దేశంలో ఇప్పటి వరకు 147 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా ఈ మహమ్మారి భారత సైన్యానికి కూడా విస్తరించింది. ఇండియన్ ఆర్మీలో తొలి కేసు నమోదైంది. లడాక్ స్కౌట్స్ (స్నో వారియర్స్) విభాగానికి చెందిన ఒక జవానుకు కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆయనను క్వారంటైన్ కు తరలించారు.
ఫిబ్రవరి 27న సదరు జవాను తండ్రి ఇరాన్ నుంచి వచ్చారు. ఈ సందర్భంగా సాధారణ సెలవుపై ఇంటి వద్ద ఉన్న జవాను తన తండ్రితో గడిపారు. జవాను తండ్రిని ఫిబ్రవరి 29 నుంచి క్వారంటైన్ చేశారు. ఆయనకు కరోనా పాజిటివ్ అనే విషయం మార్చి 6 తెలిసింది. ఆ మరుసటి రోజు సదరు జవానును కూడా ఐసొలేషన్ కు తరలించారు. ఆయనకు కూడా కరోనా పాజిటివ్ అనే విషయం గత సోమవారం స్పష్టమైంది.