రాజకీయాలు, పాలనా వ్యవహారాలతో అనునిత్యం ఎంతో బిజీగా ఉండే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు.
అమెరికాలోని ప్రతిష్ఠాత్మక హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ లో ‘లీడర్ షిప్ ఇన్ ది ట్వంటీ ఫస్ట్ సెంచరీ: కాన్ఫ్లిక్ట్ అండ్ కరేజ్’ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు.
శిక్షణ పూర్తి చేసుకున్న రేవంత్ కు హార్వర్డ్ అధ్యాపకులు సర్టిఫికెట్ ప్రదానం చేశారు. అధికారంలో ఉండగానే ఈ సర్టిఫికెట్ పొందిన తొలి భారతీయ ముఖ్యమంత్రిగా రేవంత్ చరిత్ర సృష్టించారు.
ఈ ప్రోగ్రామ్ లో ప్రపంచ వ్యాప్తంగా 20కి పైగా దేశాల నుంచి 62 మంది విద్యార్థులు పాల్గొన్నారు. జనవరి 25న ఈ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ప్రారంభమయింది.
ఈ శిక్షణలో రేవంత్ సాధారణ విద్యార్థిలా గడిపారు. 21వ శతాబ్దంలో ప్రపంచానికి ఎదురయ్యే సవాళ్లు, నాయకత్వ మెళకువలు, సంక్షోభ పరిస్థితులను ధైర్యంగా ఎలా ఎదుర్కోవాలనే అంశాలపై కేస్ స్టడీలు, గ్రూప్ ప్రాజెక్టుల ద్వారా వీరికి శిక్షణ కొనసాగింది.

