telugu navyamedia
National రాజకీయ వార్తలు సాంకేతిక

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో రిలయన్స్ ఇండస్ట్రీస్, జియో కలిసి రూ.10 లక్షల కోట్ల పెట్టుబడి: ముకేశ్ అంబానీ

ఆర్టిఫిషియల్ఇంటెలిజెన్స్  రంగంలో రిలయన్స్ ఇండస్ట్రీస్, జియో కలిసి  రాబోయే ఏడేళ్లలో ఈ రంగంలో రూ.10 లక్షల కోట్ల వరకు పెట్టుబడి పెట్టనున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ ప్రకటించారు.

‘ఏఐ ఇండియా ఇంపాక్ట్ సమ్మిట్’లో ప్రసంగించిన ఆయన, ఈ పెట్టుబడి కేవలం లాభాల కోసం కాదని, దేశ నిర్మాణం కోసం దశాబ్దాల పాటు ఆర్థిక విలువను సృష్టించే మూలధనమని స్పష్టం చేశారు.

ప్రస్తుతం ఏఐ రంగంలో అతిపెద్ద సమస్య కంప్యూటింగ్ వనరుల కొరత, అధిక ఖర్చు అని అంబానీ అన్నారు.

ఈ సవాలును అధిగమించేందుకు ‘జియో ఇంటెలిజెన్స్’ ద్వారా మూడు కీలక కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు.

జామ్‌నగర్‌లో గిగావాట్-స్థాయి ఏఐ-రెడీ డేటా సెంటర్ల నిర్మాణం ప్రారంభించామని, 2026 ద్వితీయార్థంలో 120 మెగావాట్ల సామర్థ్యం అందుబాటులోకి వస్తుందని చెప్పారు.

తమకున్న గ్రీన్ ఎనర్జీ సామర్థ్యమని, ఆంధ్రప్రదేశ్‌, కచ్‌లలోని సౌర విద్యుత్ ప్లాంట్ల నుంచి 10 గిగావాట్ల గ్రీన్ పవర్ సిద్ధంగా ఉందని వివరించారు.

దేశవ్యాప్తంగా ఎడ్జ్ కంప్యూటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయడం. దీని ద్వారా సామాన్యులకు సైతం తక్కువ ఖర్చుతో, వేగవంతమైన ఏఐ సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.

అన్ని భారతీయ భాషల్లో ప్రపంచస్థాయి ఏఐ సామర్థ్యాన్ని సాధించడం తమ లక్ష్యమని, ఇది సమ్మిళిత వృద్ధికి దోహదపడుతుందని అన్నారు.

ఏఐ ఉద్యోగాలను తీసివేయదని, కొత్తగా నైపుణ్యం గల ఉద్యోగాలను సృష్టిస్తుందని అంబానీ భరోసా ఇచ్చారు.

దేశంలోని స్టార్టప్‌లు, ఐఐటీలు, పరిశోధన సంస్థలతో పాటు ప్రపంచంలోని అగ్రశ్రేణి టెక్ కంపెనీలతో కలిసి పనిచేస్తామని, ఏఐ శతాబ్దానికి భారత్‌ను సహ-నిర్మాతగా నిలుపుతామని ఆయన వెల్లడించారు.

Related posts