పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కరోనా బారిన పడ్డారు.ఈ నెల 3వ తేదీన తిరుపతిలో జరిగిన పాదయాత్ర, బహిరంగసభలో పాల్గొన్న పవన్ కల్యాణ్.. హైదరాబాద్కు తిరిగి వచ్చిన తర్వాత కాస్త నలతగా ఉండడంతో.. వైద్యుల సూచనల మేరకు కోవిడ్ టెస్ట్లు చేయించుకున్నారు.. అయితే, ఫలితాలు నెగిటివ్గా వచ్చాయి.. కానీ, అప్పటి నుంచి ఆయన వ్యవసాయ క్షేత్రంలో హోం క్వారంటైన్లోనే ఉన్నారు.. జ్వరం, ఒళ్లునొప్పులు ఆయనను ఇబ్బంది పెట్టడంతో.. రెండో రోజుల క్రితం మరోసారి కోవిడ్ పరీక్షలు చేయించగా.. పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని జనసేన పార్టీ పేర్కొంది. ఖమ్మంకు చెందిన వైరల్ వ్యాధుల నివారణ నిపుణులు, కార్డియాలజిస్టు డాక్టర్ తంగెళ్ల సుమన్.. హైదరాబాద్కు వచ్చి పవన్ కల్యాణ్కు చికిత్స ప్రారంభించారని.. అవసరమైన ఇతర పరీక్షలన్నీ చేయించారని.. ఊపిరితిత్తుల్లో కొద్దిగా నిమ్ము చేరడంతో.. యాంటివైరల్ మందులతో చికిత్స చేస్తున్నారని.. అవసరం అయినప్పుడు ఆక్సిజన్ కూడా పెడుతున్నారని జనసేన తన ప్రకటనలో పేర్కొంది. ఇక, చిరంజీవి, సురేఖ, రాంచరణ్, ఉపాసన ఎప్పటికప్పుడు పవన్ ఆరోగ్యం గురించి తెలుసుకుంటున్నారని.. అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారని.. అపోలో నుంచి ఒక వైద్య బృందం కూడా వచ్చి పవన్ కల్యాణ్ను పరీక్షించింది. ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగా ఉందని జనసేన పార్టీ పేర్కొంది.