పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని ఉగ్రవాద స్థావరాలపై దాడి లక్ష్యంగా భారత్ చేపట్టిన మిలటరీ చర్య ‘ఆపరేషన్ సిందూర్’ కొనసాగుతోందని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ తెలిపారు.
రెండో వైపు నుంచి ఎలాంటి దుందుడుకు చర్యలు ఎదురైనా సమర్ధవంతంగా తిప్పికొట్టేందుకు బలగాలు 24 గంటలూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
ఢిల్లీలో శుక్రవారంనాడు జరిగిన డిఫెన్స్ సెమినార్లో ఆయన మాట్లాడుతూ, యుద్ధంలో రన్నర్-అప్ అంటూ ఉండరని తాను గతంలో కూడా చెప్పానని, ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోందని, ఇందుకు తగ్గట్టుగా బలగాలు పూర్తి సన్నద్ధతతో ఉండాలని అన్నారు.
అడ్వాన్స్డ్ టెక్నాలజీ యుగంలో మనం ఉన్నామని, యుద్ధాల గతి మారిపోయిందని సీడీఎస్ ఈ సందర్భంగా వెల్లడించారు.
ఆయుధాలు, టెక్నాలజీ పరిజ్ఞానం గురించి మిలటరీ పూర్తిగా అప్డేట్ కావాలని అభిప్రాయం వ్యక్తం చేశారు.
వార్ఫేర్, టాక్టికల్, ఆపరేషనల్ అండ్ స్ట్రాటజిక్ అనే మూడు స్థాయిల్లోనూ వారియర్లు మాస్టర్లు కావాలన్నారు. ఆయుధాలు, శాస్త్ర (నాలెడ్జ్) రెండిటిపైనా మిలటరీకి అవగాహనకు అవసరమని చెప్పారు.
పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోవడంతో ఇందుకు ప్రతిగా భారత్ ఆపరేషన్ సిందూర్ నిర్వహించింది.
పాక్లోకి చొచ్చుకెళ్లి తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది. 100 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టింది.
ఇందుకు బదులుగా మే 8,9,10 తేదీల్లో భారత మిలటరీ స్థావరాలపై డ్రోన్లు, క్షిపణలుపై దాడులకు పాక్ తెగబడింది.
వీటిని భారత బలగాలు సమర్ధవంతంగా తిప్పికొట్టాయి. ఈ క్రమంలో కాల్పుల విరమణకు మే 10న పాక్ ప్రతిపాదన చేయడంతో భారత్ అంగీకరించింది.

