కాంగ్రెస్ పార్టీలో తాను ఒంటరిని కావొచ్చని, కానీ ప్రజలు మాత్రం వారి తరఫున ప్రాతినిధ్యం వహించడానికి, సమస్యలను లేవనెత్తడానికి తనను పార్లమెంటుకు పంపించారని కాంగ్రెస్ పార్టీ ఎంపీ శశిథరూర్ అన్నారు.
శశిథరూర్ మరోసారి పార్లమెంటులో కాంగ్రెస్ సహా విపక్షాల తీరుపై విమర్శలు గుప్పించారు.
ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్), ఇతర అంశాలపై ప్రతిపక్షాలు ఆందోళనలు లేవనెత్తుతుండటంతో పార్లమెంటు సమావేశాల్లో అంతరాయాలు నెలకొంటున్నాయి. ఈ అంశంపై ఆయన స్పందించారు.
సమస్యలను పార్లమెంటులో చర్చించడానికి గందరగోళం సృష్టించాల్సిన అవసరం లేదని ప్రతిపక్షాలను ఉద్దేశించి అన్నారు. ఇక్కడ దేశం కోసం, ప్రజల కోసం మాట్లాడాలి తప్ప, అరిచి గందరగోళం సృష్టించడం సరికాదని అన్నారు.
తాను మొదటి నుంచి ఇదే విషయం చెబుతున్నానని, సోనియా గాంధీ సహా తన పార్టీ నాయకులకు ఈ విషయం తెలుసని ఆయన అన్నారు.
తనను ప్రజలు ఎన్నుకున్నది తమ కోసం, దేశం కోసమని, తన తెలివితేటలు ఉపయోగించి మాట్లాడాలనే ఉద్దేశంతో ఇక్కడకు పంపించారని పేర్కొన్నారు.

