telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు ప్రచారం ను ఖండించిన కల్వకుంట్ల కవిత

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సొంతంగా రాజకీయ పార్టీ పెట్టబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారంపై ఆమె స్పందించారు.

ఈ ఊహాగానాల్లో ఎటువంటి నిజం లేదని స్పష్టం చేస్తూ, ఒక దినపత్రికలో వచ్చిన కథనం క్లిప్పింగ్ను తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు.

“కనీసం నన్ను సంప్రదించకుండా ఈ వార్త రాసిన పత్రికది జర్నలిజమా?? శాడిజమా?” అంటూ ఆమె ప్రశ్నించారు. ప్రస్తుతం కవిత చేసిన ఈ పోస్ట్ వైరల్గా మారింది.

కొంతకాలంగా తెలంగాణ జాగృతి సంస్థను బలోపేతం చేసే దిశగా కవిత అడుగులు వేస్తున్నారు. జాగృతికి అనుబంధ సంఘాలను వరుసగా ప్రకటించడం, సంస్థ కార్యకలాపాలను విస్తరించడం వంటి పరిణామాలతో ఆమె కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారనే ప్రచారం ఊపందుకుంది.

వరంగల్లో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభ అనంతరం పార్టీ అధ్యక్షుడు, తన తండ్రి కేసీఆర్కు ఆమె ఒక లేఖ రాయడం, ఆ తర్వాత అమెరికా పర్యటనకు వెళ్ళే ముందు జాగృతి అనుబంధ సంఘాల బాధ్యులను ప్రకటించడం వంటివి ఈ ప్రచారానికి మరింత బలం చేకూర్చాయి.

సామాజిక మాధ్యమాల్లో అయితే ఏకంగా పార్టీ పేరు కూడా ఖరారైందని, కేసీఆర్ పంపిన దూతలతో కవిత జరిపిన మంతనాలు విఫలమయ్యాయని కథనాలు వెలువడ్డాయి.

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2వ తేదీన కవిత తన కొత్త పార్టీని ప్రకటిస్తారంటూ విస్తృతంగా వార్తలు వచ్చాయి. అయితే, ఈ కథనాలన్నింటినీ కవిత ఖండించారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సొంత పార్టీ నేతల తీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

పార్టీలో తనకు వ్యతిరేకంగా కుట్రలు జరుగుతున్నాయని ఆరోపిస్తూనే, తన తండ్రి, పార్టీ అధినేత కేసీఆర్పై పూర్తి విధేయతను ప్రకటించారు.

పార్టీ అంతర్గత వ్యవహారాలు, తనకు ఎదురైన అనుభవాలపై ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

బీఆర్ఎస్ను బీజేపీలో కలపాలని కొంతమంది చూస్తున్నారని కవిత ఆరోపించారు.

బీజేపీలో విలీనం చేయవద్దని తాను జైల్లో ఉన్నప్పుడే చెప్పానని ఆమె తెలిపారు.

తన లేఖను ఎవరు బయటపెట్టారో చెప్పమంటే తనపై దాడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related posts