ఏపీలో అన్ని వ్యవస్థలు అతలాకుతలం అయ్యాయని జనసేన అధినేత పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని తిరోగమనం దిశగా వెళ్తున్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్కు అనేక రాజధానులు పెడతారా.. పిల్లి కాపురంలో పిల్లల్ని ఆరు చోట్లకు మార్చిందన్న చందాన రాజధాని అక్కడ.. ఇక్కడ అంటూ చివరకు ఏమీ లేకుండా చేస్తారేమో అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. సచివాలయ పోస్టుల నియామకాల్లో తప్పిదాలు జరిగాయంటూ ఆరోపణలు గుప్పించారు. లోపభూయిష్టమైన మద్యం విధానంతో భారీస్థాయి అవినీతికి తెర తీసిందని ఆరోపించారు. ఇదే సమయంలో అనేక సమస్యల పైన పార్టీ పరంగా తీసుకోవాల్సిన నిర్ణయాలను ఖరారు చేశారు.
రాజధాని విషయంలో ప్రభుత్వం వ్యూహాత్మకంగా గందరగోళం సృష్టిస్తున్నదని జనసేన అభిప్రాయ పడింది. జగన్ పాలన పూర్తిగా వైఫల్యం చెందిందనే అభిప్రాయం సమావేశంలో వ్యక్తం అయింది. ఏపీకి రావలసిన రాబడులు కోల్పోతూ ఆర్థిక వ్యవస్థ కుంటుపడితే అభివృద్థి ఏ విధంగా జగన్ ప్రభుత్వాన్ని పోలిట్ బ్యూరో ప్రశ్నించింది. కొత్త ఇసుక విధానం పేరుతో నిర్మాణ రంగాన్ని, అందుకు అనుబంధంగా అన్ని వ్యవస్థల్ని తిరోగమన దిశలోకి జగన్ ప్రభుత్వం తీసుకెళ్లిందని పొలిట్బ్యూరో మండిపడింది. ఇసుక లభ్యత లేక రాష్ట్రంలో 35 లక్షల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కోల్పోయారు. వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయని సమావేశంలో అభిప్రాయ పడ్డారు. అందుబాటులో ఉన్న ఇసుకను సైతం భారీ ధరలకు విక్రయిస్తుండడంతో నిర్మాణదారులు తమ నిర్మాణాలను నిలిపివేసే పరిస్థితి నెలకొందని పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు.