తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. రాష్ట్రంలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం ప్రారంభమైంది.
తొలి రోజే సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు అభ్యర్థుల నుంచి భారీ స్పందన లభించింది.
రాష్ట్రవ్యాప్తంగా తొలిరోజు సర్పంచి పదవుల కోసం 3,242 నామినేషన్లు, వార్డు సభ్యుల స్థానాలకు 1,821 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.
తొలి దశలో భాగంగా మొత్తం 4,236 గ్రామపంచాయతీలు, 37 వేలకు పైగా వార్డులకు పోలింగ్ జరగనుంది.
ఈ నెల 29 వరకు అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేయవచ్చు. 30వ తేదీన నామినేషన్ పత్రాల పరిశీలన చేపడతారు.
డిసెంబర్ 3 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. అదే రోజు పోటీలో ఉన్న తుది అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు.
డిసెంబర్ 11న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించనున్నారు.
పోలింగ్ ముగిసిన వెంటనే, అదే రోజు మధ్యాహ్నం ఓట్ల లెక్కింపు చేపట్టి వార్డు సభ్యులు, సర్పంచుల ఫలితాలను వెల్లడిస్తారు.

