ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఓ సీఐ షటిల్ ఆడుతూ హఠాత్తుగా మృతి చెందాడు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన భగవాన్ ప్రసాద్ పశ్చిమ గోదావరి జిల్లా గణవరంలో సీఐగా విధులు నిర్వహిస్తున్నారు. రోజూ షటిల్ ఆడటం ఆయన అలవాటు. ఎప్పటిలాగే గణవరం పోలీస్ స్టేషన్ సమీపంలో షటిల్ ఆడేందుకు వెళ్లారు. ఆట మధ్యలోనే ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే అప్రమత్తమైన తోటి క్రీడాకారులు ఆయనను పైకి లేపేందుకు ప్రయత్నించారు. అప్పటికే ఆయన నిర్జీవంగా పడిపోయారు. సీఐను వెంటనే గణవరంలోని ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. గుండెపోటు కారణంగానే సీఐ భగవాన్ మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. ఈ ఘటనతో సీఐ భగవాన్ కుటుంబంలో విషాదంలోకి వెళ్లింది. అటు సీఐ మృతదేహాన్ని ఎమ్మెల్యే వాసుబాబు సందర్శించి నివాళులర్పించారు. ఇక సీఐ షటిల్ ఆడుతూ కుప్పకూలడం సమీపంలో ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయింది. ఇందుకు సంబంధించి వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
previous post


పవన్ వ్యాఖ్యలు ఓటర్లను అవమానించడమే: ఆర్జీవీ