శారీరక సంబంధానికి అంగీకరించినంత మాత్రాన ఆమెతో గడిపిన ఏకాంత క్షణాలను వీడియోలో చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడానికి ఇచ్చిన అనుమతిగా భావించరాదని దిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది.
పరస్పర ఆమోదిత లైంగిక చర్యల గోప్యతను పాటించాల్సిందేనని తెలిపింది. ఆ దృశ్యాలను అడ్డుపెట్టుకుని బెదిరింపులకు పాల్పడుతూ ఇతరత్రా ప్రయోజనాలకు వాటిని దుర్వినియోగం చేయడం తగదని పేర్కొంది.
అత్యాచార కేసులో నిందితుడి బెయిల్ అభ్యర్థనను తిరస్కరిస్తూ జస్టిస్ స్వర్ణ కాంత శర్మ ఈ అభిప్రాయాలను వెల్లడించారు.
తనపై ఫిర్యాదు చేసిన మహిళతో దీర్ఘకాలంగా శారీరక సంబంధాలు ఉన్నాయని, అప్పు తీర్చమని అడిగినందునే తనపై అత్యాచార ఆరోపణలతో కేసు పెట్టిందని పిటిషనర్ పేర్కొన్నాడు.
ఆమెకు వివాహం కూడా అయ్యిందని, తనతో లైంగిక సంబంధాల పర్యవసానాలు ఆ మహిళకు తెలుసునని వాదించాడు.
అయితే, వివాహిత మహిళ అనే సాకుతో నేర తీవ్రతను తగ్గించి చూపే యత్నాలను అనుమతించబోమని న్యాయమూర్తి స్పష్టం చేశారు.
పరస్పర ఆమోదంతోనే లైంగిక చర్యలో పాల్గొన్నప్పటికీ ఆ దృశ్యాలను వీడియోలో చిత్రీకరించి బెదిరింపులకు పాల్పడడం, సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడం నేరమేనని జడ్జి తెలిపారు.

